హైదరాబాద్, జనవరి25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గణాంకాల నివేదికలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. తెలంగాణ మొత్తం జనాభాలో స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి దాదాపు సమానంగా ఉన్నది. రాష్ట్రంలో 1,73,92,041 మంది మహిళలు, 1,76,11,633 మంది పురుషులున్నారు. మొత్తం జనాభాలో మహిళలు 49.7 శాతం ఉండగా, పురుషులు 50.3 శాతం ఉన్నారు. 2011 నాటికి తెలంగాణ మొత్తం జనాభా 3,50,03,674గా లెక్క తేలింది. జనాభాపై ఏర్పాటైన జాతీయ కమిషన్ అంచనాల ప్రకారం 2021లో తెలంగాణలో 3,77,25,000 జనాభా ఉండగా, 2031నాటికి ఆ సంఖ్య 3,92,07,000 చేరుకుంటుందని అంచనా వేశారు.
ఈ అంచనాల ప్రకారం చూస్తే, 2011లో దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.89 శాతం. 2021 నాటికి ఇదికాస్తా 2.77 శాతానికి, అలాగే 2031 నాటికి 2.66 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. దీని ప్రకారం దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండు దశాబ్దాల్లోనే దాదాపు 0.23 శాతం తగ్గినట్టవుతుంది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మహిళలకు 988 మంది పురుషులున్నారు. సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండలో వెయ్యి మంది స్త్రీలకు 996 మంది పురుషులుండగా, అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో వెయ్యిమందికి గాను 950 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 1046 మంది మహిళలు ఉండటం గమనార్హం.
పట్టణ, గ్రామీణ జనాభా
తెలంగాణలో పట్టణ జనాభా 1,36,08,665 ఉండగా, గ్రామీణ జనాభా 2,13,95,009 ఉన్నది. మొత్తం జనాభాలో పట్టణాల్లో 38.9 శాతం, గ్రామాల్లో 61.1 శాతం ఉన్నారు.
అక్షరాస్యత
తెలంగాణలో అక్షరాస్యత 66 శాతంగా ఉన్నది. మొత్తం జనాభాలో అక్షరాస్యులు 2,06,96, 778 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 89,95,049 కాగా, పురుషులు 1,17,01,729 మంది. చదువుకున్నవారిలో మహిళలు 58%, పురుషులు 75% ఉన్నారు.
బాల,బాలికల నిష్పత్తి
రాష్ట్రంలో ఆరేండ్లలోపు పిల్లలు 38,99,166 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 18,81,231, బాలురు 20,17,935 మంది ఉన్నారు.