హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సైఫాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 79.82శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మొత్తం 48,167 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 38,447 మంది పాసయ్యారు. సప్లిమెంటరీలోనూ బాలికలే సత్తాచాటారు. బాలికలు 82.21శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.42శాతం పాసయ్యారు. ఒక్కో సబ్జెక్టుకు రీ కౌంటింగ్ కోసం రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1200 ఫీజు చెల్లించి ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీదేవసేన వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.