హైదరాబాద్ : జూలై 3న గురు పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం(Arunachalam) టూర్ ప్యాకేజీకి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) తెలిపారు. అరుణాచలానికి ఇప్పటివరకు 15 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయగా, 13 బస్సుల్లో సీట్లన్ని పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన రెండు బస్సులకు ముందస్తు రిజర్వేషన్(Reservations) ప్రస్తుతం కొనసాగుతోందని పేర్కొన్నారు.
రిజర్వేషన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 12, వేములవాడ నుంచి 2, మహబూబ్నగర్ నుంచి ఒక బస్సును అరుణాచలానికి పంపుతున్నామని వివరించారు. భక్తుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అరుణాచలం టూర్ ప్యాకేజీ ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సంప్రదించవచ్చని సజ్జనార్ తెలిపారు.