Y Sathish Reddy | మహిళలను గౌరవించుకోవాల్సిన మహిళా దినోత్సవం( Womens Day ) రోజున మహిళా ప్రజాప్రతినిధి అయిన కల్వకుంట్ల కవిత( MLC Kavitha )కు రాజకీయ దురుద్దేశంతో ఈడీ( ED ) నోటీసులు ఇచ్చింది అని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ( BJP ) కుట్రలో భాగమే అని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదుర్కునే సత్తాలేక ఇలా తమ జేబు సంస్థలతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఓ నాయకురాలికి మహిళా దినోత్సవం రోజుల ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో నిరసనకు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు అని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. అన్ని మహిళా సంఘాలు కూడా ఇందులో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తాము సైతం కదిలివస్తామని చెప్పాయి. అయితే.. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుందని బీజేపీకి భయం పట్టుకుంది. మహిళలకు బీజేపీ సర్కారు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోలేకపోతున్నామనే విషయాలు ప్రజలందరికి తెలిసిపోతాయని కేంద్ర సర్కారుకు భయం మొదలైంది. అందుకే ఎలాగైనా కవిత కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు పిలిచి రెండు రోజుల పాటు విచారణ పేరుతో ఆపేస్తే ఢిల్లీలో నిర్వహించాల్సిన కార్యక్రమం ఆగపోతుందని బీజేపీ దుష్ట ఆలోచన చేసిందని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
కుంభకోణాలకు కేరాఫ్ అయిన బీజేపీకి ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది అని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అదానీ కుంభకోణంపై పెదవివిప్పని బీజేపీ నేతలు.. ఇతర పార్టీలపై మాత్రం ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎన్నికల పనిలో బిజీగా ఉంటే.. అపోజిషన్ పార్టీలను అడ్డుకునే పనిలో బీజేపీ జేబు సంస్థలైన ఈడీ, సీబీఐ బిజీగా ఉన్నాయి. బీజేపీ అక్రమాలను, అరాచకాలను ప్రశ్నించిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీతో అణచివేయాలని చూస్తున్నారు. బీజేపీకి ధీటుగా ఉన్న పార్టీలపైనే విచారణ సంస్థల దాడులు, నోటీసులే దీనికి నిదర్శనం.
గతంలో పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీని బీజేపీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఆమె సన్నిహితులను కేసుల పేరుతో వేధించింది అని ఆయన గుర్తు చేశారు.
ఇక మహిళా నాయకులను కించపరుస్తూ మాట్లాడటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో రాహుల్ గాంధీ పుట్టుక గురించి ఏకంగా బీజేపీకి చెందిన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మాతృమూర్తిని అవమానించారు. బీజేపీ అక్రమాలు వెలికి తీసిన స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టును రాయలేని భాషలో తిట్టారు. ఇలా చాలా మంది మహిళా నాయకులను బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచులు వెంటపడి వేధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహిళలను వేధిస్తున్న, కనీస గౌరవం కూడా ఇవ్వని బీజేపీని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని సతీష్ రెడ్డి అన్నారు.