హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రి కల్చర్ డిప్లోమా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మే 17న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈసారి బాసర ఆర్జీయూకేటీ ఈ పరీక్షలో చేరడం లేదు. ఇదిలా ఉండగా పాలిసెట్-2023 దరఖాస్తు ఫీజు స్వల్పంగా పెరిగింది. జనరల్, బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రూ.450 ఉండగా.. ప్రస్తతుం దాన్ని రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరిగానే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 11న పాలిసెట్ నోటిఫికేషన్ వెలువడనుండగా 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవనున్నది.