హైదరాబాద్: ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని కళాకారుల జాబితాలో ప్రత్యేక పెన్షన్ను ప్రభుత్వం తరపున అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావడం బాధగా ఉందన్నారు. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రం అరుదైన చిత్రకారుడు, ఫొటో జర్నలిస్ట్ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. భరత్ భూషణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. భరత్ భూషణ్ దేశం గర్వించదగ్గ అరుదైన చిత్రకారుడు అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
చిత్రకారుడు భరత్ భూషణ్ ఆకస్మిక మరణం తనను ఎంతగానో బాధేసిందని ఎంపీ సంతోష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవన చిత్రాన్ని తన ఫొటోలు, పెయింటింగ్ల ద్వారా ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఆయన కుటుంబానికి తీవ్ర సానుభూతిని తెలిపారు.
ప్రముఖ చిత్రకారుడు భరత్ భూషణ్ మరణం పట్ల తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముప్పై ఏండ్లుగా ఆత్మ విశ్వాసం పెట్టుబడిగా, ఆత్మ గౌరవమే సంపదగా మొక్కవోని ధైర్యంతో ఫొటో గ్రాఫర్గా, చిత్రకారుడుగా స్వయంకృషితో జీవిస్తూ తెలంగాణ సంస్కృతిని తలెత్తుకుని నిలిచేలా చేశారని కొనియాడారు. గత కొన్నేండ్లుగా తనకు ఎంతో పరిచయస్తుడైన భరత్ భూషణ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు.