హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయాశాఖల కార్యదర్శులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ.545 కోట్లు పొదుపు చేసుకున్నారు. అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం పొదుపు చేస్తూ వచ్చారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. ఆసరా పథకం కింద మొదట్లో రూ.వెయ్యి, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్గా ఇస్తున్న విషయం తెలిసిందే. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నది. మహిళలు సైతం అభయహస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు.
పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి. అయితే, ఆ నిధులు మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వనున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఆ నిధిని ఆయా మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.