TS Minister Koppula Eswar | తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్లలోనే విద్యా రంగంలో అనేక అనూహ్య మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న 565 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ సందర్భంగా హైదరాబాద్లోని బంజారా సేవా భవన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ముందుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉపాధ్యాయ బృందంతో కలిసి జ్యోతి ప్రజ్వ లన చేశారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, పేదలకు మంచి విద్య వసతి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన చేయలేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావంతోనే అద్భుత ప్రగతి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో విద్యా వైద్య రంగాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణలోని గురుకుల విద్యాలయాలు దేశవ్యాప్తంగా గౌరవాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు. గురుకుల విద్యాలయాల్లో కాంటాక్ట్ పద్ధతిన 16 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించుకోవడం అనేది దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయం అన్నారు.
ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్ విజన్కి నిదర్శనంగా నిలిచిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజకీయ నిర్ణయంతోనే ఇది సాధ్యం అయ్యిందన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులను.. వీఆర్ఎలు, విద్యుత్ కార్మికులు.. వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ అమలు చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఉపాధ్యాయులు బాటలు వేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న అద్భుత ఫలితాలు, విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ అమోఘం అని అన్నారు. సమైక్య పాలనలో అస్తవ్యస్థంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకు వచ్చారని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
ఎందరో పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ఇది తెలంగాణ ప్రభుత్వం పని తీరుకు నిదర్శనం కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యా రంగం అభివృద్ధి వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఎంతో గొప్ప విజన్తో రాష్ట్ర అభివృద్ధితోపాటు అన్ని వర్గాల మేలు కోసం సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు బాసటగా నిలబడాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్బంగా గురుకుల ఉపాధ్యాయులు మంత్రి కొప్పుల ఈశ్వర్ను గజ మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ నవీన్ నీకోలాస్, అడిషనల్ సెక్రటరీ హన్మంత్ నాయక్. జాయింట్ సెక్రెటరీ పార్వతి దేవీ, నిరూపమా సక్రనాయక్, ఉపాధ్యాయ బృందం రజని, జానకి, విక్టోరియా, సునీత తదితరులు పాల్గొన్నారు.