TS Minister Gangula | కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్పై రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అవినీతి డబ్బుతో ఎంపీటీసీలు, సర్పంచ్లను అంగట్లో పశువులను కొన్నట్లు కొంటున్నాడని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రాంనగర్ గీత భవన్, మంచిర్యాల చౌరస్తా, నాకా చౌరస్తాలలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తేవడంలో విఫలమయ్యాడని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. అసమర్ధ బీజేపీ కావాలా, సమర్థవంతమైన బీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.
రానున్న ఎన్నికల్లో అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు కరీంనగర్ అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయన్నారు. జరుగుతున్న అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని అన్నారు.
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అవినీతి డబ్బుతో రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ ప్రజలు బీజేపీ అభ్యర్థి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.. గత ఎన్నికల్లో గుండెపోటు డ్రామాలాడి ఎంపీగా గెలిచాడన్నారు. భార్య పుస్తెలు తాకట్టుపెట్టి ఎన్నికల్లో నిలబడ్డానని చెప్పిన సంజయ్కు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారన్నారు…ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, కచ్చు రవి, గందె మాధవి మహేష్, రమణారావు,ప్రసాద్, హర్ష కిరణ్, మల్లేశం, కుర్ర తిరుపతి ఎడ్ల సరిత అశోక్ తదితరులు పాల్గొన్నారు