ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తున్నది. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వైద్యారోగ్య శాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ వైద్యవిద్య విభాగం పరిధిలోనివే. మొత్తం 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ మల్టీజోనల్ స్థాయి పోస్టులు. నూతన జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన మొదటి నోటిఫికేషన్ కావడం విశేషం. మల్టీజోన్-1లో 574 పోస్టులు, మల్టీజోన్-2లో 573 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించారు.
ఆన్లైన్లో దరఖాస్తులు.. రూ.500 ఫీజు
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20 ఉదయం 10:30 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తుది గడువును 2023 జనవరి 5 సాయంత్రం 5 గంటలుగా నిర్ధారించారు. ఆయా విభాగాల్లో పీజీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం
ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వీస్ రూల్స్ లో మార్పులు చేసింది.
వైద్యశాఖలో ఉద్యోగాల వర్షం మంత్రి హరీశ్రావు
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ను ట్విట్టర్లో షేర్ చేశారు. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.