TS ICET | హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ -2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా మే 7వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ టీ రమేశ్, కన్వీనరగ్ ప్రొఫెసర్ ఎస్ నర్సింహాచారి కలిసి అధికారికంగా ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి 20 తేదీ మధ్య మార్పులు చేసుకోవచ్చు. మే 28వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం.. జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. జూన్ 15న ప్రాథమిక కీ, జూన్ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాల స్వీకరణ, జూన్ 28వ తేదీన ఫైనల్ కీ, ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.