2014 జూన్ 2కు ముందు తెలంగాణలో ఉన్న 20 వైద్య కళాశాలల్లో మాత్రమే ఏపీ విద్యార్థులకు స్థానిక కోటా కింద సీట్లు దక్కుతాయి. కానీ తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని 85 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ తెలంగాణ ప్రాంత విద్యార్థులకే చెందుతాయి. ఆలిండియా కోటా 15 శాతం సీట్లలోనే ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగానే వారు 15 శాతంలో పోటీపడొచ్చు.
– హైకోర్టు ధర్మాసనం
Medical seats | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది. 2014 జూన్ 2వ తేదీకి ముందున్న కాలేజీల్లోనే తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీ విద్యార్థులకు సమాన అవకాశాలుంటాయని తేల్చిచెప్పింది. కొత్త కాలేజీల్లోని కాంపిటెంట్ పూల్లో ఉండే 85 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే సొంతమని, ఏపీ విద్యార్థులు సెంట్రల్ పూల్లోని 15 శాతం సీట్లలో పోటీ పడొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ విధానంలో మార్పులుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న జారీచేసిన జీవో 72ను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన సానికొమ్ము వెంకటసాయి భరత్రెడ్డి మరికొందరు దాఖలుచేసిన 63 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 72 రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేసింది.
పదేండ్ల రూల్ పాత కాలేజీలకే
రాష్ట్రంలో వైద్యవిద్య విప్లవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిం దే. ఇందులో భాగంగా జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్నది. ఈ కాలేజీలన్నీ రాష్ట్రప్రభుత్వ నిధులతోనే ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత పలు ప్రైవే టు మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటయ్యా యి. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 85 శాతం కాంపిటెంట్ కోటా సీట్లు మొత్తం తెలంగాణ విద్యార్థులకే చెందేలా ప్రభు త్వం జీవో 72 జారీచేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95లో పేర్కొన్నట్టుగా పదేండ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన కాలేజీల్లో మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులతో సమానంగా హక్కులు ఉంటాయని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది.
దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్లను కొట్టేసిన కోర్టు, స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్లు లభిస్తాయన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది. దీనిపై 59 పేజీల్లో సవివరమైన తీర్పు వెలువరించింది. ఆలిండియా కోటా మినహా మిగిలిన సీట్ల భర్తీలో తెలంగాణ, ఏపీ విద్యార్థులకు సమాన రిజర్వేషన్ ఉంటుందన్న ఏపీ విద్యార్థు ల వాదనను తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సీట్లకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95 వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం సమర్థించింది. ‘2014 జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పా టు చేసిన వైద్య కళాశాలల్లోని 85 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ తెలంగాణ వి ద్యార్థులకే చెందుతాయి. ఆలిండియా కోటా 15 శాతం సీట్లలోనే ఏపీ విద్యార్థులకు అవకా శం ఉంటుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగానే ఏపీవారు అందులో పోటీపడొ చ్చు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 72కు చట్టబద్ధత ఉన్నది. దీనిని కొట్టేయాలన్న వాదనను ఆమోదించలేం’ ధర్మాసనం అని చెప్పింది.
ప్రభుత్వ నిర్ణయం సరైనదే
ఎంబీబీఎస్ సీట్లపై తాము జారీచేసిన జీవో 72 చట్టబద్ధమేనని విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ‘ఉమ్మడి ఏపీ విభజన నాటికి తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ కాలేజీల్లోని 2,850 సీట్లలో 15 శాతం కోటాకింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. 853 సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన 34 వైద్య కళాశాలల్లోని 8,215 సీట్లలో ఆలిండియా రిజర్వేషన్ 15 శాతం, తెలంగాణ స్థానికులకు 85 శాతం సీట్ల కేటాయించడం చట్టబద్ధమే. జీవో 72 నిబంధనలు 1974 జూలై 3వ తేదీ నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5, 6 పేరాలకు విరుద్ధం కాదు. ఏపీ విభజన జరిగేనాటికి ఉన్న కాలేజీలకే సెక్షన్ 95 వర్తిస్తుంది. ఆ తర్వాత ఏర్పాటై న 34 కొత్త (20 ప్రభుత్వ, 14 ప్రైవేటు) కాలేజీల్లోని ఆలిండియా కోటా 15 శాతంలో మా త్రమే ఏపీ విద్యార్థులు పోటీపడాలి. తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా 108, 104, 106 జీవోలు ఇచ్చింది. వీటిని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు జో క్యం చేసుకోలేదు. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. కాబట్టి ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేయండి’ అని ఏజీ వాదించారు. ఈ వాదనకు ధర్మాసనం సమ్మతించింది.
వందశాతం రిజర్వేషన్లు లేవు
రీటా నిరంకారీ, సందీప్ జైన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తమకూ వర్తిస్తాయని పిటిషనర్లు చెప్పడం చెల్లదని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘నూరు శాతం రిజర్వేషన్లు చెల్లవని సత్యజిత్ కుమార్, చేబ్రోలు లీలా ప్రసాదరావు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉద్యోగాలకు సంబంధించినది. ఆ తీర్పులు విద్యాసంస్థల్లో సీట్ల ప్రవేశానికి వర్తించవు. వైద్య సీట్ల ప్రవేశాల్లో వందశాతం రిజర్వేషన్లు లేవు. 85 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లలోనే వందశాతం స్థానికులకు రిజర్వేషన్ ఉన్నది. మిగిలిన 15 శాతం ఆలిండియా కోటా సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగానే ఏపీ విద్యార్థులు కూడా పోటీపడొచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 72 తెచ్చిందన్న పిటిషనర్ల వాదనలో నిజం లేదు. అందుకే ఈ 63 పిటిషన్లను కొట్టేస్తున్నాం’ అని ధర్మాసనం ప్రకటించింది.
సవరణ హక్కు రాష్ర్టానికి ఉన్నది
వైద్య సీట్లలో ప్రవేశాలకు సంబంధించి 2017 నాటి నిబంధనల్లో సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం ఏపీ, తెలంగాణల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య విద్య సీట్ల భర్తీలో పదేండ్లపాటు రెండు రాష్ట్రాలకు కాంపిటెంట్ అథారిటీ కోటాలో సమాన అవకాశాలు కల్పించాలి. తెలంగాణ ఏర్పాటైన తేదీ నుంచి పదేండ్లపాటు ఆ నిబంధన అమల్లో ఉంటుంది. 2014 జూన్ 2వ తేదీ నా టికి ఉన్న కాలేజీల్లో మాత్రమే ఆ ప్రవేశాల కోటా ఉంటుంది. నిబంధనల సవరణ తర్వాత సెక్షన్ 95 ప్రకారం ఏపీ విద్యార్థులకు ఏవిధమైన చట్టబద్ధ హకులు ఉండవు. ఈ నిబంధనల సవరణ చేసే అధికారం లోక్సభకు మాత్రమే ఉందన్న పిటిషనర్ల వాదన చట్ట విరుద్ధం. చట్ట సవరణ చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉన్నది. వైద్య సీట్ల ప్రవేశాల నిమిత్తం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం జూలై 6న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని బట్టి వైద్య సీట్ల ప్రవేశ ప్రక్రియ మొదలుకాకముందే జీవో 72 వెలువడింది’ అని ధర్మాసనం పేర్కొన్నది.
ఇక ఏటా 1,820 సీట్లు అదనం: మంత్రి హరీశ్రావు
హైకోర్టు తీర్పుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ బిడ్డలకు ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయని తెలిపారు. ఇది 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమని చెప్పారు. ‘రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం శుభ పరిణామం. హైకోర్టు తాజా తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయి. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఏటా 1,820 సీట్లు దకనున్నాయి. ఇది దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం’ అని మంత్రి ట్వీట్ చేశారు.