హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. జూన్ 3 నుంచి చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.
భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల గ్రామీణ క్రీడా కమీటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సీఎం తెలిపారు.