హైదరాబాద్ : కరోనా పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. రాష్ర్టంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. గత నెల 29న లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.
ప్రయివేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్లతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 10 ఆస్పత్రులకు కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఔషధాలకు దేశ వ్యాప్తంగా కొరత ఉంది. ఈ చికిత్సకు ఔషధాలు కొనుగోలు చేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కరోనా చికిత్సకు కూడా తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు. మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ను పెంచుతున్నాం. నీలోఫర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశాం. మూడో దశకు అవసరమైన మందులను ముందే కొనుగోలు చేస్తాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ప్రజలను అప్రమత్తం చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు.