హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా అడోల్సెంట్ హెల్త్ కిట్స్ (శానిటరీ హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లు) పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుక గానూ మొత్తం రూ.69.52 కోట్లతో అడలోసెంట్ కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని 8 నుంచి 12వ తరగతి చదువుతున్న దాదాపు 11లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కోసం11 లక్షల కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ కిట్లో ఆరు శానిటరీ న్యాప్కిన్ ప్యాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 22 లక్షల కిట్లు కొనుగోలు చేయనుంది. ఈ కార్యక్రమం అమలు చేస్తామని ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు అమలు చేస్తోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, 15-24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో సుమారు 32శాతం మంది న్యాప్కిన్ లాగా క్లాత్ వినియోగిస్తున్నారు. దీంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసున్న కౌమార బాలికలు రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. దీంతో వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, తద్వారా చదువుపై మరింత శ్రద్ధ చూపించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థినుల హాజరు శాతం కూడా పెరిగేందుకు తోడ్పడుతుంది.