హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంగళవారం నిర్వహించిన రెండు సెషన్లకు 90.4 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ తెలిపారు.
అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 98.9 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ సెంట్రల్ కేంద్రాల్లో 86.8 శాతం మంది హాజరయ్యారు. రెండో రోజు జరిగిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 58,376 మంది హాజరు కావాల్సి ఉండగా, 52,796 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపు కూడా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కొనసాగనుంది. తొలి రోజు జరిగిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 58,548 మంది విద్యార్థులకు గానూ 53,509 మంది విద్యార్థులు హాజరయ్యారు.