హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీవర్షాల కారణంగా వాయిదా పడిన ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్స్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు కాగా, ఆగస్టు 1న ఈసెట్ నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి ఈసెట్ హాల్టికెట్లు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని లింబ్రాది కోరారు. ఎంసెట్ కొత్త హాల్టికెట్ల కోసం వెబ్సైట్ను సంప్రదించవచ్చని తెలిపారు.
పీజీఈసెట్ వాయిదా..
ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణతో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ను వాయిదావేశారు. ముందుగా ఈ పరీక్షలు ఈ నెల 29 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించాల్సి ఉన్నది. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ ఎగ్జామ్స్ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.