CS Shati Kumari | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి సుమారు 9.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందు కోసం 1521 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఆయా కేంద్రాల్లో ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి సైతం సెల్ఫోన్ తీసుకెళ్లకుండా నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు, మూల్యాంకన కేంద్రాలను తీసుకెళ్లే సమయంలో పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. పరీక్షా పత్రాలు కూడా లీక్ అవకూడదని సీఎం హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లాస్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని తెలిపారు. 5.8లక్షల మంది విద్యార్థులు హాజరవనుండగా.. 2,676 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ ఇంటర్, పది పరీక్షల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశించారు.