హైదరాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు ప్రభుత్వరంగ సంస్థ టీఎస్ ఆగ్రోస్ ముందుకొచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా చిరుధాన్యాలతో పాటు వాటి ఉత్పత్తులను విక్రయించేందుకు ఔట్లెట్స్ ఏర్పాటు చేయించనున్నది.
తొలిదశలో జిల్లా కేంద్రాల్లో ఒకటి లేదా రెండు చొప్పున, జీహెచ్ఎంసీ పరిధిలో 10 ఔట్లెట్స్ ఏర్పాటు చేయాలని ఆగ్రోస్, అక్షయపాత్ర యోచిస్తున్నాయి. త్వరలోనే ఔత్సాహిక మహిళల్ని ఎంపిక చేసి వారికి ఔట్లెట్స్ను కేటాయించనున్నారు. ఇప్పటికే ఔత్సాహిక మహిళలకు గురువారం రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)లో సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 100 మందికి పైగా ఔత్సాహిక మహిళలు హాజరయ్యారు. వ్యాపార నిర్వహణ, పెట్టుబడి, రుణాలు, సరుకుల సరఫరా వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
మిల్లెట్ ఔట్లెట్ వ్యాపారానికి అవసరమైన చిరు ధాన్యాలను, వాటి ఉత్పత్తులను అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేయనున్నది. షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటైనర్ షాప్లను కూడా రూపొందించి ఇచ్చేందుకు టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్య ఒప్పందం కుదురింది. మొత్తం 68 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. రైతుల నుంచి ప్రత్యేకంగా చిరు ధాన్యాలను కొనుగోలు చేసి వాటి నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్తో అత్యంత నాణ్యతగా ఆహార పదార్థాలను తయారు చేయనున్నది. నూడుల్స్, బిస్కెట్లనూ తయారు చేయనున్నారు.
మిల్లెట్ వ్యాపారంలోకి ప్రవేశించే మహిళలకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఆగ్రోస్ చర్యలు తీసుకున్నది. ఎలాంటి పూచీకత్తు ఇవ్వకుండానే హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు అంగీకరించారు.