హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ): ఫీజుల నియంత్రణ చట్టం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) స్వాగతించింది. ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడింది. ఫీజుల నియంత్రణ చట్టం రూపకల్పనలో ప్రైవేట్ స్కూళ్ల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని, కమిటీలో యాజమాన్యాల ప్రతినిధులకు చోటు కల్పించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30 తరువాత విద్యాసంస్థలకు సెలవులను పొడిగించవద్దని, ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. సెలవులు ఇవ్వడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమ్మతిపత్రాలు సేకరించాలని సూచించారు.