సిద్దిపేట, ఫిబ్రవరి 23 : తెలంగాణకే తలమానికమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం శుభదినమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాకతాళీయమే అయినప్పటికీ బుధవారం చాలా ప్రత్యేకతలున్న రోజని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కొమురెల్లి మల్లన్న దేవుడి పుట్టినరోజైన బుధవారం నాడే మల్లన్నసాగర్ను సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకొన్నామని హర్షం వ్యక్తంచేశారు. ‘ఈ రోజు మల్లన్నదేవుడికి చాలా ఇష్టమైన రోజు. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని రుజువు చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. మల్లన్నసాగర్ను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేసినయి.
ఈ ప్రాజెక్ట్ మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో 350 కేసులు వేశారు. ఫిబ్రవరి 23, 2018 నాడు మన దేశ అత్యున్నత న్యాయస్థానం అన్ని కేసులు కొట్టి వేసి, కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ రోజుకు అంత ప్రత్యేకత ఉన్నది. ఈ నడిగడ్డ ప్రాంతంలో రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది అని ఈ ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడ రూపకల్పన చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతం తాగు, సాగునీళ్లు లేక కరువు కాటకాలకు నిలయం. కానీ, నేడు గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడిగా వందేండ్లు ముందు ఆలోచించి నది లేని చోట రిజర్వాయర్ను పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్’ అని హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ నదికి కొత్త నడక నేర్పిన వ్యక్తి అన్నారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు హల్దీ వాగులో, కూడవెళ్లి వాగులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీళ్లు వదిలితే కోట్ల విలువైన ధాన్యం పండిందని గుర్తుచేశారు. నాడు అది ట్రయల్ మాత్రమేనని, నేడు అధికారికంగా ప్రారంభించుకొన్నామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండకాలం లాగానే కనబడుతుండేనని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో ఈ ఏడేండ్ల కష్టంలో ఏ కాలం చూసినా వానకాలం లాగానే కనపడుతున్నదన్నారు. మండుటెండల్లో చెరువులు, చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ పంపుల్లో పరవళ్లు తొక్కుతున్న నీళ్లను చూస్తే జీవితం ధన్యమైందన్న భావన కలిగిందని చెప్పారు. జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని హరీశ్రావు పేర్కొన్నారు.
వెక్కిరించిన నీళ్లు మూతపడ్డాయి
నది, వాగు, చుక్క నీరు లేని చోట 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ నిర్మించడం అంటే ఏడారిలో ఒయాసిస్సుగా విపక్షాల నేతలు కొట్టిపారేశారని హరీశ్రావు గుర్తుచేశారు. మల్లన్నసాగర్ ప్రారంభం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కరువుపీడిత ప్రాంతాల్లో గోదావరి, కృష్ణా నీళ్లు పారాలె, తెలంగాణ సస్యశ్యామలం కావాలె, ప్రజలు బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు మాత్రం రక్తం పారాలె, రాజకీయంగా లబ్ధ్ది పొందాలనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఒకరు.. ప్రాజెక్టు నిర్మాణం కానేకాదని మరికొందరు అప్పట్లో బురదజల్లి, వెక్కిరించారని.. ఇప్పుడు వాళ్ల నోర్లు మూతపడేలా మల్లన్నసాగర్ను కేసీఆర్ నిర్మించి చూపారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమకు ఓట్లు వేయకుంటే జేసీబీలు, పొక్లెయినర్లతో ఆస్తులు కూల్చేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారన్న హరీశ్.. ‘వారు పొక్లెయినర్లు, జేసీబీల భాష మాట్లాడుతున్నారు. పొక్లెయినర్లతో ప్రాజెక్టులు కట్టవచ్చని, జేసీబీలతో కాల్వలు నిర్మించవచ్చని తమ నాయకుడు సీఎం కేసీఆర్ నేర్పించారు’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులు కట్టడం, ప్రజలకు నీళ్లు ఇవ్వడం, వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తున్నదని, తాము అదే భాష మాట్లాడుతున్నామని చెప్పారు. బెదిరించే పార్టీ కావాలో, ప్రాజెక్టులు కట్టి ప్రజలను సంతోషపెడుతున్న పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.