హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచి తుది రౌండ్ వరకు రౌండు రౌండుకు టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది.
మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 ఓటర్లు ఉండగా, రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పోలైన మొత్తం ఓట్లలో టీఆర్ఎస్కు 97,006, బీజేపీకి 86,697, కాంగ్రెస్కు 23,906 ఓట్లు పోలయ్యాయి. మునుగోడు ఉపఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ 405, బీజేపీ 211, కాంగ్రెస్, 41, బీఎస్పీ 10 సాధించాయి. తరువాత మొదటిరౌండ్లో చౌటుప్పల్ మండలంలోని ఓట్లను లెకించగా టీఆర్ఎస్ 1,352 ఓట్ల ఆధిక్యత సాధించింది. అటు తరువాత ప్రతి రౌండ్లోనూ మెజార్టీ పెరిగింది. పదో రౌండ్లో 1,361, పన్నెండో రౌండ్లో అత్యధికంగా రెండువేల మెజార్టీ సాధించింది. దీంతో టీఆర్ఎస్ విజయం ఖరారైపోయింది.
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకొన్నది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కనీసం డిపాజిట్ కూడా దకించుకోలేకపోయారు. స్రవంతి డిపాజిట్ దకించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ 23,906 ఓట్లే వచ్చాయి. ఎన్నికల ఫలితాల ప్రక్రియ పూర్తయిన వెంటనే రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్, కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్ చేతుల మీదుగా టీఆర్ఎస్ అభ్యర్థిఆ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ధృవీకరణ పత్రం అందుకొన్నారు. ప్రభాకర్రెడ్డి వెంట మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ నేత సోమ భరత్ తదితరులు ఉన్నారు.
మునుగోడులో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తాజా ఉప ఎన్నికతో టీఆర్ఎస్ బలం పెరిగింది. 2018లో మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 74,687 ఓట్లు వచ్చాయి అప్పుడు 22,552 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు 22,319 ఓట్లు అదనంగా పోలయ్యాయి.