హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మునుగోడులో కారు గెలుపు ఖాయమని, అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు. బుధవారం శాసనమండలి ప్రాంగణంలోని తన చాంబర్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. మునుగోడులో బీజేపీకి బలం లేదని, రాజగోపాల్రెడ్డికి ఉన్న బలంతోనే సభ అలా సాగిందని, ఇక గెలవడం కాని పని అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, లొల్లి అంతా విపక్ష లీడర్లు మాత్రమే చేస్తున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నిక ఫలితం సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపబోదని చెప్పారు. పార్టీలు మారే నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మతకలహాలు సృష్టించడం కరెక్ట్ కాదని సూచించారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లా అని, అక్కడ మతతత్వ పార్టీలకు స్థానం లేదని చెప్పారు.
రాజగోపాల్రెడ్డి.. వెంకట్రెడ్డినీ ముంచుతాడు..
బీజేపీకి ఉన్న అస్త్రాలు ఈడీ, సీబీఐ, ఐటీ మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే ఆ పార్టీనే అడ్రస్ లేకుండా పోతుందని గుత్తా హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. కవిత ఇంటిపై కాషాయ దాడి సరైన పద్ధతి కాదన్నారు. ఉప ఎన్నిక వల్ల రాజగోపాల్రెడ్డి మునగడమే కాదు వెంకట్రెడ్డిని కూడా ముంచుతాడని గుత్తా జోస్యం చెప్పారు.
చౌటుప్పల్, ఆగస్టు 24: దేశాన్ని అప్పులకుప్పగా మార్చిన బీజేపీని ఓడించే సత్తా కేవలం టీఆర్ఎస్కే ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్తో తాము కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు. ఇక్కడ డబ్బుతో గెలిచి ఉనికిని చాటుకోవాలనుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని, మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ మతతత్వ శక్తులను పెంచి పోషిస్తున్నదన్నారు. అలాంటి పార్టీలో రాజగోపాల్రెడ్డి ఎందుకు చేరాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, మున్సిపాలిటీ కార్యదర్శి బండారు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా పాల్గొన్నారు.
మహబూబాబాద్, ఆగస్టు 24: మునుగోడు ఉప ఎన్నికలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్లానేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ర్టాల ప్రభుత్వాలను చీల్చిందని అన్నారు. బుధవారం మహబూబాబాద్లో సీపీఐ జిల్లా 2వ మహాసభ సందర్భంగా ఓసీ క్లబ్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలనే కుటిలయత్నంతోనే రాజగోపాల్రెడ్డికి 21 వేల మైన్స్ కాంట్రాక్టర్ అప్పగించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిందని మండిపడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వామా.. బ్లాక్మెయిల్ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.