హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గుర్తు చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ నేతలు సోమ భరత్, రమేశ్రెడ్డి సీఈవో వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్లో ఉండటంతో కారుకు పడే ఓట్లు చాలావరకు ఆయా గుర్తులకు పోల్ అవుతున్నాయని తెలిపారు. అందుకే తాము ఆ గుర్తులను తొలగించాలని మరోసారి ఫిర్యాదు చేశామని తెలిపారు.
గుర్తింపు పొందిన పార్టీల కంటే ఆయా గుర్తులకు ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయన్నారు. గతంలో తీసివేసిన గుర్తులు కూడా మళ్లీ యాడ్ చేసినట్టు తెలుస్తున్నదని అన్నారు. ఎలాగైనా గెలువాలని బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి పేరున్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ముందుగా చెప్పింది బీజేపీ నేతలే కాబట్టి వాళ్లే దొంగ ఓట్ల నమోదుకు కుట్ర చేశారన్నారు. బీజేపీ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీ అభ్యర్థి అమ్ముడుపోవడం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఓటర్లు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.