BRS | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధనే శ్వాసగా తెలంగాణ గడ్డపై ఉద్భవించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది యావత్దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నది. 22 ఏండ్ల ప్రస్థానంలో 14 ఏండ్లు తెలంగాణకోసం మడమతిప్పని పోరాటం చేసి దేశచరిత్రలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప కాలంలోనే దేశాన్ని తనవైపునకు తిప్పుకున్న ప్రతిభాసంపత్తి తెలంగాణ సొంతం. అసమాన వ్యూహచతురత, అద్వితీయ కార్యదీక్షగల అధినేత చేతిలో తెలంగాణ యావత్దేశాన్ని మంత్రముగ్ధం చేస్తున్నది. 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా దిగ్విజయంగా 22 ఏండ్లు పూర్తిచేసుకొని 23 ఏట అడుగుపెట్టబోతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ బీఆర్ఎస్ నేడు జాతీయ రాజకీయాల్లోకి క్రియాశీల భూమికను పోషించనున్నది.
సింహగర్జన నుంచి మహాగర్జన దాకా
2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో మే 17న ఏర్పాటు చేసిన సింహగర్జన సభ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. మఖలో పుట్టి పుబ్బలో రాలిపోతుంది అంటూ నిట్టూర్చినవారు కరీంనగర్సభ చూసి భయపడిపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు, 85 జడ్పీటీసీ స్థానాలను, 3 వేల సర్పంచ్, 12 వేల వార్డులు, వందకుపైగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని సత్తాను చాటింది. 2003లో వరంగల్లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకునే అనివార్యతను సృష్టించింది. 25 లక్షలమందితో అదే వరంగల్ గ డ్డమీద 2010 డిసెంబర్ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన ప్రపంచ భారీసభల సరసన చేరింది.
ఇక్కడ భావజాల వ్యాప్తి.. అక్కడ ప్రగతివైభవ దీప్తి
ఉద్యమసమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మదిమదిని తట్టిలేపేందుకు భావజాలవ్యాప్తి తోడ్పడితే బీఆర్ఎస్గా ప్రస్తుతం మహారాష్ట్రలో తెలంగాణ అభివృద్ధి నమూనాను రుచిచూపించి ముందుకు సాగుతున్నది. దేశ రాజకీయ చరిత్రలో ఒక ఉపప్రాంతీయ పార్టీగా పుట్టి ప్రాంతీయ పార్టీగా తనను తాను నిరూపించుకొని ఇప్పుడు జాతీయరాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ఎదిగింది.
రాష్ట్రంలో ప్రగతి పూలవాన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఉద్యమ రథసారధి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే అన్నీ సవ్యంగా లేవు. విభజన సమస్యలు వెంటాడాయి. అధికారులు, సిబ్బంది కేటాయింపు మొదలు రాష్ట్ర వనరుల పంపిణీ వరకు ప్రతీ రంగంలో కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సరారు వివక్ష చూపింది. అనేక ఆటుపోట్లను, అడ్డంకులను తట్టుకొని నిలిచి, గెలిచిన తెలంగాణ ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లుగా అనేక పథకాలను ప్రజల కోసం అమలు చేసింది. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలులో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నది.