నల్లగొండ: యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నల్ల జెండాలు రెపరేపలాడుతున్నాయి.
నిరసర కార్యక్రమంలో భాగంగా నల్లగొండలోని తన నివాసంపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉదయాన్నే నల్లజెండా ఎగురవేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నల్లజెండా ఎగురువేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.