మీరే ముందుండి నడిపించాలి.. కేసీఆర్పై టీఆర్ఎస్ ముఖ్య నేతల ఒత్తిడి
ఉద్యమాల గడ్డతోనే దేశ ఉద్ధరణ.. ఉద్యమ పార్టీ నుంచి మరో ఉద్యమం
75 ఏండ్లైనా దేశ రాజధానిలో మంచి నీళ్లు లేవు, కరెంటు లేదు.
దేశమంతా మత విద్వేషం అంతర్జాతీయంగా పరువు నష్టం.
ఇదీ జాతీయ పార్టీల పాలనాదక్షత
బీజేపీ చెలగాటం.. జాతికి సంకటం
చూస్తూ ఊరుకుంటే పెను ప్రమాదం
టీఆర్ఎస్ ఇష్టాగోష్ఠిలో సుదీర్ఘ చర్చ
తెలంగాణ నమూనాయే అత్యుత్తమం..
తెలంగాణలో చేయగలిగింది.. దేశంలో ఎందుకు చేయలేరు?
‘ఎటుపోతున్నదీ దేశం.. ఏమిటీ మనం జాతికిచ్చే సందేశం’.. అడ్డూ అదుపు లేని ధరలు.. దేశ రాజధానికే లేని కరెంటు, నీళ్లు.. భారతమంతా మత విద్వేషాలు.. భవిష్యత్తుపై భయ సందేహాలు.. అంతర్జాతీయంగా అవమానాలు.. ఏమిటీ పరిపాలన? ఎవరు దీనికి జవాబుదారీ?’ అంటూ గత కొంత కాలంగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ జరిగింది. దేశ పౌరులుగా దీన్ని చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనవంతుగా మనమేమైనా చేయగలమా? అని లోతైన మథనం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఆరేడు గంటల పాటు టీఆర్ఎస్ ప్రముఖులు దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై సమగ్ర పరిశీలన జరిపారు. ఇందులో ఆసక్తికర వాదనలు, ప్రతిపాదనలు ముందుకొచ్చాయి.
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దాని పర్యవసానాలు, ఫలితాలు, ప్రభావాలపై లోతైన మథనం జరిగింది. మోదీ నేతృత్వంలోకి వచ్చిన తర్వాత బీజేపీ.. పాత విలువలకు, విధానాలకు తిలోదకాలిచ్చి, రాజకీయ ప్రయోజనాలకు, అధికారాన్ని దక్కించుకోవడానికి మత విద్వేషాలను రేపడమే పనిగా పెట్టుకొన్నదని, ఈ క్రమంలో జాతి, దేశ ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తున్నదని అభిప్రాయం వ్యక్తమైంది.
75 ఏండ్లలో ఎక్కువ కాలం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పాలించినా.. దేశంలో గుణాత్మక మార్పు రాకపోగా, పరిస్థితి నానాటికీ తీసికట్టు, నాగంబొట్టు అన్న మాదిరిగా తయారవుతున్నదని ఈ చర్చలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఒక ఉద్యమ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్, దాని రూపకర్త అయిన సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదని నాయకులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. అణగారిన తెలంగాణ బతుకుల్లో ఆశలు చిగురింపజేయడానికి కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్.. ఇక్కడి జాతి జనుల ఆకాంక్షలను పరిపూర్ణం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించటమే కాకుండా, దాన్ని ఎనిమిదేండ్లలోనే ప్రగతిపథంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, అది సాధించిన అభివృద్ధి, ప్రారంభించిన పథకాలు, పూర్తి చేసిన ప్రాజెక్టులు అనేక రాష్ర్టాలకే కాకుండా కేంద్రానికి కూడా ఆదర్శంగా మారాయని అన్నారు. ఈ క్రమంలో 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చటానికి మరోమారు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉన్నదని ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే భారత దేశ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి మరో ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం కనిపిస్తున్నదని కూడా వారు అభిప్రాయపడ్డారు. దీనికి కూడా కేసీఆరే నడుం బిగించాలని ముక్తకంఠంతో కోరారు. అందుకోసం జాతీయ పార్టీని ప్రారంభించాల్సి వస్తే అందుకు ఏమాత్రం వెనుకాడ వద్దని కూడా వారు స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పూర్తిగా చేవచచ్చి పోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దాన్ని భర్తీ చేయడానికి జాతీయ పార్టీ ప్రారంభించటం ఒక్కటే మార్గమని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
దుస్థితిలో దేశం
‘ఇవ్వాల్టి వార్త ఏమిటంటే.. దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లు లేవు. కరెంటు అంతకంటే లేదు. దేశ రాజధానికి నీళ్లు ఇవ్వాల్సిందిగా హర్యానాను దేహీ అన్న పరిస్థితి. ఏసీలను ఎక్కువ టెంపరేచర్లో మాత్రమే వాడుకోవాలని విద్యుత్తు సంస్థలు ప్రజలను ఆదేశిస్తున్న దుస్థితి. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? తెలంగాణ ఏర్పడిన ఏడాది నుంచే ఇక్కడ అన్ని రంగాలకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వగలుగుతున్నప్పుడు.. ఢిల్లీలో కేంద్రం ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణలో ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయగలుగుతున్నప్పుడు ఢిల్లీలో మోదీ ఎందుకు చేయలేదు? ఢిల్లీలోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి. దీన్ని చక్కదిద్దాలంటే ఎక్కడో ఓ చోట ఉద్యమం మొదలవ్వాలి. ఒక అభివృద్ధి విప్లవం రావాలి. అది మనతోనే మొదలవ్వాలి. అందుకు మీరే సరైన నాయకుడు’ అని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ మత విద్వేషాలు రేపటం వల్ల జాతి ఆహుతయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని వారు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా భారతదేశ పరువు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర రాజ్యం అమెరికా మొదలుకొని అతి చిన్న దేశమైన ఖతర్ నుంచి కూడా మనం పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఒక మంత్రి ఆవేదన వ్యకం చేశారు. మోదీ ఘనంగా ప్రచారం చేసుకొన్న గుజరాత్ మాడల్ అనేది గాలి ప్రచారం తప్ప ఇంకేమీ కాదని, దానికన్నా తెలంగాణ మాడల్ అద్భుతమైనదిగా రుజువైందని అన్నారు. అందువల్లే బీజేపీ అధికారంలోకి రావటానికి అభివృద్ధిని వదిలేసి, మత విద్వేషాన్ని ఎత్తుకొన్నదని ఆయన వివరించారు.
ఫ్రంట్లపై విసుగెత్తిన జనం
‘యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రయోగాలన్నీ గతంలో విఫలమయ్యాయి. దేశ ప్రజలు వాటితో విసిగిపోయి ఉన్నారు. కప్పల తక్కెడ, కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం మాత్రం సాధ్యపడదు. అసలు ఇలాంటి ఫ్రంట్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయటం. ఇది తెలంగాణ నుంచే జరగాలి. ఎందుకంటే దేశంలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుడు మీరే’ అని సీఎం కేసీఆర్కు విన్నవించారు. ‘దేశంలో రాజకీయ, నాయకత్వ శూన్యత ఉన్నది. సోషలిస్టు భావజాలంతో యంగ్ టర్క్లుగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇప్పుడు వృద్ధులుగా మారటమో, కాలం చేయటమో జరిగింది. కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా, ఆ నాయకులకు దేశ ప్రజల ఆమోదం లేదు. ఇంగ్లిష్, హిందీలో ధారాళంగా మాట్లాడగల ప్రావీణ్యం లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన లేదు. ఇవన్నీ ఉన్న ఒకే ఒక్క సీనియర్ నాయకుడు కేసీఆర్. అందువల్ల బీజేపీని ఎదిరించడానికి ఆయన ముందుండి పోరాడక తప్పదు అని ఒక మంత్రి తన వాదనను వినిపించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ‘దేశంలో విప్లవాత్మక మార్పు రావాలంటే తెలంగాణ ప్రజలుగా మనం మరో ఉద్యమాన్ని తలకెత్తుకోవాల్సిందే. గుణాత్మక మార్పు కోసం సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకు మొదటి నుంచే ఉన్నది’ అని పార్టీ ప్రముఖులంతా ముక్తకంఠంతో నినదించారు.
అన్నింటా మోదీ విఫలం
‘మోదీవి మాటలు తప్ప చేసిందేమీ లేదు. ఒక గొప్ప పథకం లేదు. సమస్యను పరిష్కరించిందీ లేదు. సరిహద్దు భద్రతలో విఫలం, ఆర్థికంగా విఫలం, విదేశాంగ విధానంలో విఫలం, అంతర్గత భద్రతలో విఫలం, సంక్షేమంలో విఫలం, సామాన్యుడిని ఆదుకోవటంలో విఫలం. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో విఫలం. పంటలు పండించుకోనీయరు.. పండిన పంట సక్రమంగా అమ్ముకోనీయరు. సవాలక్ష కొర్రీలు పెడతారు. ఎటు చూసినా మోదీ సర్కారుది వైఫల్యమే. ఎనిమిదేండ్లయినా చెప్పుకోవటానికి ఏమీ లేదు’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. మరో జాతీయ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పూర్తిగా కునారిల్లుపోయిందని, బీజేపీకి పోటీనిచ్చే పరిస్థితిలో గానీ, బీజేపీని తట్టుకొని నిలబడే స్థితిలో గానీ లేదని వారు పేర్కొన్నారు. మళ్లీ అది లేచే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఈ క్రమంలో పోరాటాల ఖిల్లా అయిన తెలంగాణే తన నమూనాను దేశవ్యాప్తం చేసి, జాతికి మార్గం చూపాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇందుకు జాతీయ పార్టీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని వారు కేసీఆర్కు సూచించారు.