హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక.. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ పోరు ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగియడంతో ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ పార్టీనే గెలువబోతున్నట్లు వెల్లడైంది. బీజేపీ రెండో స్థానం, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి.
జనం సాక్షి రిపోర్టు.. ఈ రిపోర్టు ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 15 వేల నుంచి 20 వేల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకునే అవకాశం ఉందని, పాల్వాయి స్రవంతి మూడోస్థానంలో నిలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్.. టీఆర్ఎస్కు 41నుంచి 42 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. బీజేపీకి 35 నుంచి 36 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్కు 16.5 నుంచి 17.5 శాతం ఓట్ షేర్ రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్ షేర్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇతరులకు 1.5 నుంచి 2 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం కనబడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి 85 వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ రిపోర్టు ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీకి 42.13 శాతం ఓట్లు, బీజేపీకి 31.98 శాతం, కాంగ్రెస్కు 21.06 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
పల్స్ టుడే పోల్ ప్రకారం.. 42 నుంచి 43 శాతం ఓట్లు, బీజేపీకి 38.05 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని పేర్కొంది.