హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: పార్లమెంటు లోపల, బయట ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడంలోనూ, బుధవారం ఉభయసభలను స్తంభింపజేయడంలోనూ టీఆర్ఎస్ ముఖ్యపాత్ర పోషించింది. పాలు, పాల ఉత్పత్తులు, పలు నిత్యావసర వస్తువులపై కేంద్రం విధించిన జీఎస్టీని తక్షణమే రద్దు చేయడంతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన ఆందోళనకు ఇతర విపక్ష పార్టీలు తోడయ్యాయి. ఆయా అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ ధర్నాకు దిగారు.
పాలు, పెరుగు ప్యాకెట్లు, ఇతర ఆహారపదార్ధాలను ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పసిపిల్లలు తాగే పాలపైనా ప్రధాని మోదీ పన్నులేస్తూ భవిష్యత్తు భారతాన్ని పొత్తిళ్లల్లోనే నుసిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, మల్లికార్జున్ఖర్గేతో పాటు టీఎంసీ, డీఎంకే, శివసేన, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ తదితర పార్టీల నేతలు కూడా గాంధీ విగ్రహం వద్దకు తరలివచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలతో గొంతు కలిపారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరిపి, పన్నుల భారం నుంచి ప్రజలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు లోపల కూడా టీఆర్ఎస్ సభ్యులు చురుకుగా వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే ముందుగా టీఆర్ఎస్ సభ్యులు.. జీఎస్టీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరితో విపక్ష పార్టీల సభ్యులు కూడా గొంతుకలిపారు. ఆయా అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చొంటే చర్చను ప్రారంభిస్తామని లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ, విపక్షసభ్యులు.. ప్రభుత్వ సమాధానం కోసం పట్టుబడుతూ ఉభయసభల్లో పోడియంలను చుట్టుముట్టి, వెల్లోకి దూసుకెళ్లారు. ఒకదశలో సభలో ఏమి జరుగుతున్నదో తెలియని గందరగోళం ఏర్పడింది.
దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ సభలను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్, ఉపరాష్ట్రపతి ప్రకటించారు. అనంతరం 12 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా అదే పరిస్థితి నెలకొన్నది. దీంతో మధ్నాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. 2 గంటల తరువాత కూడా టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల సభ్యులు కూడా పట్టువీడకపోవడంతో సభను గురువారానికి వాయిదావేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యలు మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న ప్రజా సమస్యలపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకొన్నదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చకు నిరాకరిస్తూ మోదీ ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా వ్యవహరిస్తున్నదని, దీంతో పార్లమెంటు కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె వచ్చి సమాధానం ఇస్తారు!
ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొవిడ్ నుంచి కోలుకొని పార్లమెంటుకు వచ్చాక సమాధానాలు ఇస్తారని కేంద్ర మంత్రులు పీయూష్గోయల్, ప్రహ్లాద్ జోషి, స్మృతిఇరానీ పేర్కొన్నారు. 2016 నుంచి 2020 వరకు ఉపా చట్టం కింద 24,134 మంది విచారణ ఎదుర్కొన్నారని, వారిలో 212 మంది మాత్రమే దోషులుగా తేలారని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి నిత్యానంద్రాయ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. కాగా, ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయి న పరుగుల రాణి పీటీ ఉష బుధవారం ప్రమాణం చేశారు.
అన్నీ తానైన టీఆర్ఎస్
జీఎస్టీ పెంపుదల, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలను, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న ప్రజాగ్రహాన్ని ఎలుగెత్తి చాటేందుకు బుధవారం ధర్నా చేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలను కూడగట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఉదయం నుంచే వివిధ పార్టీల నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి సరైన సమయంలో తీసుకెళ్లకపోవడం, సమిష్టిగా నిరసన తెలుపకపోవడం వల్ల మోదీ ప్రభుత్వం ఎవరినీ లెక్కచేయటం లేదని చెప్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఆహ్వానించారు. ఉభయసభల్లో కేకే, నామా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి, ఇతర పార్టీల నేతలను సమన్వయం చేశారు.