హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పార్లమెంట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. యాసంగిలో కొనుగోళ్లపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. ధాన్యం కొంటరా.. లేదా? అన్న ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎంపీల పోరాటాన్ని, రైతుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరించింది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీలు మూడ్రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కేంద్రంలో చలనం లేదు. యాసంగి కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా ఏదో ఒక స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం స్పష్టత ఇవ్వకపోగా.. రైతులను అయోమయానికి గురి చేసేలా పాత లెక్కలను కొత్త కాగితాలపై ఇచ్చి ఏమార్చేందుకు ప్రయత్నించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు? ఇందులో వానకాలంలో ఎంత.. యాసంగిలో ఎంత కొంటారో చెప్పాలని రాష్ట్ర ఎంపీలు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవిత, రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్రం అస్పష్ట సమాధానం ఇచ్చింది. వానకాలంలో దేశవ్యాప్తంగా 521.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు నిర్ణయించామని, యాసంగిలో మాత్రం ఇంకా నిర్ణయించలేదని కేంద్రం నిస్సిగ్గుగా ప్రకటించింది. ఓవైపు రాష్ట్రంలో యాసంగి సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రైతులు వరి నార్లు పోస్తున్నరు. కానీ కేంద్రం దృష్టిలో మాత్రం ఇంకా సీజన్ ప్రారంభమే కాలేదు. సీజన్కు ప్రారంభం ముందే ధాన్యం కొనుగోలు అంచనాలు చెప్తే అందుకు తగ్గట్టుగా రాష్ట్ర రైతాంగానికి ఏ పంటలు వేయాలో సూచిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా.. కేంద్రం మాత్రం తన మొండి వైఖరిని విడనాడలేదు.
మూడ్రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో తెలంగాణ రైతుల పక్షాన గళం వినిపిస్తున్నారు. ప్రతిరోజూ లోక్సభలో పోడి యం వద్దకు, రాజ్యసభలో అధ్యక్ష స్థానం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ఎంపీలందరూ బుధవారం రోజంతా స్పీకర్ పోడియం వద్దే బైఠాయించారు. తెలంగాణ రైతాంగం సమస్య, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి దేశమంతా తెలిసేలా గళం వినిపించారు. అయినప్పటికీ స్పందించని కేంద్రం పెద్దలు ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎంపీలు రైతుల పక్షాన పోరాడుతుంటే.. సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ లోక్సభ స్పీకర్ కూడా అసహనం వ్యక్తంచేశారు.
యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమన్న విషయాన్ని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నది? దీని వెనుక గల ఆంతర్యం ఏమిటనే సందేహాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై అనుమానాలు కలుగుతున్నాయి. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ వాయిదాపడిన అనంతరం బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఇది స్పష్టమైంది. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతుల్లో బద్నాం చేయాలనే విధంగా కేంద్రం కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. అందుకే కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ముందుగా రైతులు ఎప్పటి మాదిరిగానే వరి పంట వేసిన తర్వాత ధాన్యం కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలనే కుట్ర చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీ రాజకీయ కుట్రను, కపట నాటకాన్ని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. రైతులను అప్రమత్తం చేస్తున్నారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనబోమంటుందని, వరి సాగు చేయొద్దని సూచిస్తున్నారు.