న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.
తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూమిక పోషించింది. అక్కడ వారిని ఏం చేశారు? ఇక్కడ కుర్చీలో కూర్చునేందుకు (అధికారంలోకి వచ్చేందుకు) అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారు? చాలా అవమానకర రీతిలో ఆంధ్రప్రదేశ్ను విభజించారు. మైకులు బంద్చేశారు. మిర్చి స్ప్రే (పెప్పర్ స్ప్రే) చల్లారు. ఎలాంటి చర్చ జరుగలేదు. ఈ విధానం మంచిగా అనిపిస్తున్నదా? ఇదేమైనా ప్రజాస్వామ్యం అనిపించుకొంటుందా? అటల్జీ ప్రభుత్వంలో కూడా మూడు రాష్ర్టాలను ఏర్పాటు చేశారు. రాష్ర్టాలను ఏర్పాటుచేయడానికి మేమేమీ వ్యతిరేకం కాదు. కానీ ఇచ్చిన విధానం ఎలా ఉన్నది? అటల్జీ సర్కారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మూడు రాష్ర్టాలను ఏర్పాటుచేసింది. కానీ అప్పుడు తుఫాన్ ఏమీ రాలేదు. అన్ని నిర్ణయాలు శాంతియుతంగా తీసుకొన్నారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కూడా ఇలాగే జరిగి ఉండాల్సింది. మేమేమీ తెలంగాణ విరోధులం కాదు. ఏపీ విభజనను కూడా అందరూ కలిసి కూర్చొని చేసి ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార దాహం దేశానికి వెగటు కలిగించింది. మీరు చేసిన ఈ చర్యవల్ల ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మీరు నాటిన చేదు బీజాలు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్కు హాని చేస్తున్నాయి. మీకు కూడా రాజకీయంగా ఎలాంటి లాభం జరుగలేదు. అలాంటిది మీరు మాకు సలహాలు చెప్తున్నారు.’