న్యూఢిల్లీ : కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టులోనూ కేంద్ర సహాయం అందలేదు. తెలంగాణను శత్రువుగా చూస్తున్నారని కేకే మండిపడ్డారు. తెలంగాణపై ఎందుకు విరోధం పెంచుకుంటున్నారని నిలదీశారు.
జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు విడుదల చేయట్లేదు. వరి ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి. బాయిల్డ్ రైస్ సమస్య అనేక రాష్ట్రాలను బాధిస్తోంది. మెజారిటీ ఉందని ప్రతిపక్ష నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయడం సరికాదు. ప్రివిలేజ్ కమిటీని కూడా ఒక అస్త్రంగా చూస్తున్నారు. పార్లమెంట్ను, కేంద్ర సంస్థలను కించపరచట్లేదు. కేంద్రం తమ అవసరాలకు సంస్థలను వాడొద్దు.
విభజన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించట్లేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఎంపీలు వాపోయారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలను అఖిలపక్ష సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి కల్పనకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కేశవరావు విమర్శించారు.