హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 29 (నమస్తే తెలంగాణ): వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, పోతుగంటి రాములు, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, పనుసూరి దయాకర్ చేపట్టిన ఆందోళనలో విపక్ష పార్టీల నేతలు సైతం పాల్గొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా నిరంకుశ వైఖరి దేశానికి కీడు చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ముగిసిన 50 గంటల నిరసన
దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ సహా 24 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్కు నిరసనగా టీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 50 గంటల ధర్నా శుక్రవారం ముగిసింది. టీఆర్ఎస్ ఎంపీలు రాత్రివేళల్లో సైతం గాంధీవిగ్రహం వద్ద కటిక నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ధర్నా లో పాల్గొన్న ఎంపీలు దీవకొండ దామోదర్రావు, లింగయ్య యాదవ్, రవిచంద్ర జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో చర్చ జరపాలని కోరిన తమపై కేంద్రం అప్రజాస్వామికంగా సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు.
అధిక ధరలు, జీఎస్టీ, ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, దీవకొండ దామోదర్రావు, పీ రాములు, బీబీ పాటిల్, నామా నాగేశ్వరరావు, సంతోష్కుమార్ తదితరులు
అధిర్ వ్యాఖ్యలపై కొనసాగిన దుమారం
రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యల దుమారం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. అధిర్ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు ధరల పెరుగుదలపై చర్చకు విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. కల్తీమద్యం తాగి గుజరాత్లో ప్రజలు మరణించడంపై అధికార బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ఫలితంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.