న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు సంబంధించిన అంశంపై ఇవాళ లోక్సభ జీరో అవర్లో టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బశ్వంత్రావ్ పాటిల్ మాట్లాడారు. కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ నగరంలోని ఉత్తర దిక్కున ఎక్కువగా విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి మేజర్ రోడ్లు కనెక్ట్ అయ్యాయని, నాగపూర్, చంద్రపూర్ రోడ్లు ఆ మార్గంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ డిమాండ్ నేపథ్యంలో.. కంటోన్మెంట్ ప్రాంతంలో కొంత వరకు రోడ్లను విస్తరించినా.. అక్కడి అధికారుల ప్రోత్సాహం లేక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టిందని, ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
కంటోన్మెంట్లో సివిల్ ట్రాఫిక్ను రాత్రి పూట నిలిపివేస్తున్నారని, దీని వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. అందుకే స్థానిక కంటోన్మెంట్ అధికారులతో తరుచూ ఘర్షణ తలెత్తుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక కంటోన్మెంట్ అధికారులకు సూచనలు చేయాలని రక్షణ మంత్రిత్వశాఖను టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ పాటిల్ కోరారు. పర్మిషన్ల విషయంలో సహకరించాలని ఆయన అభ్యర్థించారు. పర్మనెంట్గా సమస్య పరిష్కారం కోసం సహకరించాలని బీమ్రావ్ కోరారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.