కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు కొట్లాట జరుగుతున్న సమయంలో, తెలంగాణ రైతుల తరపున వకాల్తా తీసుకుంటూ మాట్లాడాలని తాము అడిగితే, పార్లమెంట్లో నోరు కూడా మెదపలేదని కవిత ఫైర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ సభ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
రైతుల పేరిట రాహుల్ గాంధీ ఓ రాజకీయ డ్రామా ఆడుతున్నారని కవిత తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ తలపెట్టిన సభ రైతు సంఘర్షణ సభ కాదని, రాహుల్ సంఘర్షణ సభ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో తీవ్రమైన సంక్షోభం వుందని, రాహుల్ తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసమే వరంగల్కు వస్తున్నారని విమర్శించారు.
అదే రకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై కూడా కవిత మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రస్తావించారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగానే ప్రశ్నించని వారు, ఇక వరంగల్లో ఏ మొహం పెట్టుకొని సభ పెడతారని మండిపడ్డారు. అసలు వరంగల్ వేదికగా సభ పెట్టడంలో ఉన్న మతలబ్ ఏంటిదని నిలదీశారు.
తెలంగాణకు రావాల్సిన ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఇంకా తెలంగాణకు రాలేదని, కేంద్రం వీటి ఊసే ఎత్తడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అటు కాంగ్రెస్ కూడా దీని ముచ్చట తీసుకురావడం లేదని, పైగా.. ఉస్మానియా క్యాంపస్కు వెళ్తామని అంటున్నారని కవిత దెప్పిపొడిచారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ తారీఖు వరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పక్షాన ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని కవిత విమర్శించారు. ఇవేవీ చేయకుండా అసలు తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.