రాజన్న సిరిసిల్ల : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని నాగిరెడ్డిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
నెల రోజుల నుంచి తెలంగాణలో ఐటీ దాడులు చేస్తున్నారు. ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను, ఎంపీని విడిచిపెట్టడం లేదు. లీగల్గా వ్యాపారం చేసుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది. అధికారులు అడిగితే సమాధానం చెప్తారు. తెలంగాణ వాళ్లు భయపడేవాళ్లు కాదని కవిత స్పష్టం చేశారు.
మన ఎమ్మెల్యేలను కొనడానికి కొందరు ప్రయత్నించారు. అడ్డంగా దొరికిన దొంగలను మనం విచారణ చేయకూడదంట. దొరికిన దొంగలపై విచారణ చేయొద్దని పిటిషన్లు వేశారు. కోర్టు నుంచి స్టే తెచ్చారు. అయినా మనం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాం. బండి సంజయ్ యాదగిరిగుట్ట వెళ్లి దొంగ ప్రమాణాలు చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బయటకు వచ్చింది. ఆయనను విచారణకు రమ్మంటే పారిపోయాడు. కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కవిత పేర్కొన్నారు.
బండి సంజయ్ నిన్న అయితే ఏడ్వనే ఏడ్సిండు. మా నాయకులంతా మంచోళ్లు.. కానీ కోర్టుకు పోతా అని చెప్తుండు. బీఎల్ సంతోష్ను అరెస్టు చేయొద్దని కోర్టుకు వెళ్లిండు. విచారణకు రమ్మని కోర్టు చెబితే.. కూడా రావట్లేదు. మన మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ ఎవరూ పిలిచిన వెళ్తున్నారు. మనకు ఏం భయలేదు. వాళ్లు ఎందుకు భయపడుతున్నారు. ఎందుకు రావట్లేదు. రాజకీయంగా గట్టిగా ఉన్న పార్టీని, ఎదిగి వచ్చిన నాయకులను గద్దల మాదిరి వచ్చి ఎత్తుకుపోవాలనే ఆలోచన వారిది. రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు బీజేపీ నాయకులు. వారికి అంతకు మించి వేరే ఆలోచన లేదు. ఈడీ దాడులకు భయపడం అని కవిత తేల్చిచెప్పారు.