నల్లగొండ : దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటాయించే నిధుల్లో కూడా కోత పెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారిపోయాడు అని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కిషన్ రెడ్డికి పట్టవు అని కోపోద్రిక్తులయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెడర్థాలు తీస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని పు:న సమీక్షించారు అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అంబేద్కర్ స్పూర్తితోనే రాజ్యాంగంలో పు:న సమీక్షలు జరుగుతాయి. అందులో తప్పు ఏముంది అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు. బీజేపీ వాళ్లకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వ సంస్థలు అమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుంది అని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో అంబానీలు, ఆదానీలు తప్ప పేద ప్రజలు ఏవరూ బాగు పడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. దాన్ని చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదు. చౌకబారు ఆరోపణలను బీజేపీ నాయకులు ఆపాలి. చేతకాని దద్దమ్మలా బీజేపీ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చమంటే కూడా బీజేపీ వాళ్లకు చేతకావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది మాట్లాడిన వివాదం చేయడమే బీజేపీ వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. బీజేపీ వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.