నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ది ఫైటర్స్ ఫ్యామిలీ ప్రశంసించారు. అరవింద్ది ఛీటర్స్ ఫ్యామిలీ అని ధ్వజమెత్తారు. నిజామాబాద్లోని తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరవింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. అరవింద్ ఒక దొంగ అని నిప్పులు చెరిగారు. బడికి పోయే వయసులో బార్ షాపుల చుట్టూ తిరిగిన ఈ బట్టేబాజ్కు సంస్కారం ఎక్కడ్నుంచి వస్తదని అరవింద్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అరవింద్ను ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్గా వర్ణించారు. అరవింద్ రాజస్థాన్లో చదువు ఒక ఫేక్. పసుపు బోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్. ఆయన చెప్పే మాటలు ఫ్రాడ్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే అరవింద్ బూతు పురాణాలకు దిగాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గేతో కవిత మాట్లాడారని బీజేపీ బ్రోకర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అరవింద్ ఎంపీగా ఈ నాలుగేళ్లలో ఏం చేసాడో, ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. మేము కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులలో, మిషన్ భగీరథ పథకంలో, మేమిస్తున్న పెన్షన్లు, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో కేంద్రానివి ఎన్ని నిధులున్నాయో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తేనందుకు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలన్నారు.