నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ మతచిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని, ఆ కుట్రలు రాష్ట్రంలో సాగబోవని హెచ్చరించారు. దేశ రైతాంగాన్ని ఏకం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో ఆయన సఫలమవుతారని తెలిపారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఆశిస్తున్నారన్నారు.
దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు నేతలు తెలంగాణలో పర్యటించి అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. సమ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, వ్యవసాయ పరంగా సమస్యలు లేకుండా ఆర్థిక పరిపుష్టి కలిగి ఉందని చెప్పారు. ప్రతి గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ రైతాంగానికి 24 గంటల కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేశ్, నాయకులు పాల్గొన్నారు.