హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రతిష్ఠను కించపర్చేలా బీజేపీ కుట్రపన్నుతున్నదని టీఆర్ఎస్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు విఘాతం కలిగిస్తున్నారని, వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని శాంతిభద్రతల అడిషల్ డీజీ జితేందర్కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం డీజీపీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ సోషల్మీడియా విభాగానికి పనిచేసినవారు ఆ పార్టీ రాష్ట్రనాయకుల ఆదేశాలతో ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారని బాల్క సుమన్ తెలిపారు. ఈ విషయంపై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో ఏడుగురిని నిందితులుగా తేల్చారని, అందులో నలుగురు అరెస్టు కాగా, ముగ్గురు పరారీలో ఉన్నారని వివరించారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేయాలని కోరినట్టు వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారని, ఆ విషయాలు బయటకు తీసేలా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేవారి భరతం పడతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారని, వారిపై ఫేక్ వీడియోలు తయారు చేయటం తమకు నిమిషాల పని అని, అయితే సంస్కారం ఉంది కాబట్టి ఆ పనిచేయటం లేదని అన్నారు. దళిత, గిరిజన శాసనసభ్యులను టార్గెట్ చేసి వాళ్ల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకొనేలా బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై ఫేక్ న్యూస్ పెట్టినట్టు గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలని పార్టీ శ్రేణులకు బాల్కసుమన్ పిలుపునిచ్చారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, చంటి క్రాంతికిరణ్, కాలె యాదయ్య, హన్మంత్షిండే తదితరులు ఉన్నారు.