హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోసగాడు మరొకరులేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ దొంగల ముఠాగా మారి వసూళ్ల దందాకు పూనుకొన్నదని విమర్శించారు. కిషన్రెడ్డి, బండి సంజయ్ అండ్కో రాష్ట్రవ్యాప్తంగా రియల్ఎస్టేట్ బిల్డర్లతో పాటు వివిధ కంపెనీల నుంచి బలవంతంగా సాగిస్తున్న వసూళ్ల దందా చిట్టా తమ వద్ద ఉన్నదని చెప్పారు. పార్లమెంటు వేదికగా బీజేపీ బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్రెడ్డి సీఎం కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. రాష్ర్టానికి మోసం చేసింది కేసీఆర్ కాదని, మోసగాళ్లకే మోసగాడిగా మోదీ మారాడని ధ్వజమెత్తారు. ఎనిమిదేండ్లుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి అన్ని అంశాల్లో దద్దమ్మలా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన వాటాను తేకుండా అసమర్థ మంత్రిగా కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్రెడ్డి తెలంగాణకు ఏమి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తూ, ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీకి దేశ ప్రజలు బైబై అంటున్నారని చెప్పారు. నిరంకుశ విధానాలతో దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న మోదీపై తిరుగుబాటు తెలంగాణ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. మోదీ కి ప్రభుత్వాలను పడగొట్టడంలో ఉన్న ధ్యాస ప్రజాజీవితాలను బాగుచేయటంలో లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్న మోదీకి తగిన గుణపాఠం తప్పదని చెప్పారు. ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి, రాష్ర్టానికి ఏం చేసిందో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు.
కిషన్రెడ్డికి బాల్క సుమన్ ప్రశ్నలు
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి తెలంగాణకు ఏనాడూ ఉపయోగపడలేదని బాల్క సుమన్ విమర్శించారు. కిషన్రెడ్డిని ఢిల్లీలోని కార్యాలయాల్లో కనీసం గుమస్తాలు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. తాము వేస్తున్న ప్రశ్నలకు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.