హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారీతిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధ్దాలు మాని, నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలని శనివారం ఓ ప్రకటనలో సూచించారు. రైతుల పట్ల ప్రధాని మోదీకి అంకిభావం ఉన్నదా..? అని ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఆదాయం రెట్టింపు చేస్తామని రైతుల సాగు పెట్టుబడిని రెట్టింపు చేసింది నిజం కాదా ? అని నిలదీశారు. ఎరువులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచింది, ఎరువుల ధరలు పెంచింది మీరు కాదా ? అని ప్రశ్నించారు. తొమ్మిది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.57,880 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో తెలంగాణ ప్రభుత్వం జమచేస్తే.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం 33 లక్షల మంది రైతులకే సాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షతో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తిరసరించింది వాస్తవం కాదా ? అని నిర్మలా సీతారామన్ను సూటిగా ప్రశ్నించారు.