హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): పసిపిల్లలు తాగే పాల మీద, విద్యార్థుల పెన్సిళ్లు, ఎరేజర్ల మీద, ఆఖరుకు దవాఖానల్లో రోగులకు ఇచ్చే రొట్టె మీదా కేంద్రం పన్నులు వేస్తున్నదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇష్టారీతిగా వేస్తున్న పన్నులతో సామాన్యుడి బతుకు దుర్భరంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరల పెరుగుదలపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు విధానాలతో దేశ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతున్నదని తెలిపారు. పన్నులు దారుణంగా పెరగటంతో ప్రజలు ఊసూరుమంటున్నారని వెల్లడించారు. పాలు, పాల ఉత్పత్తులు ఇలా అన్ని రంగాలపై విధించిన జీఎస్టీని రద్దు చేసి దేశ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. అటు.. విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై కేంద్రం కక్షగట్టిందని ధ్వజమెత్తారు. పరిమితికి మించి కేంద్రం చేస్తున్న అప్పులతో దేశానికి జరిగిన లాభం ఏమిటని నిలదీశారు.
కేంద్రం అనాలోచిత చర్యలతో రైతు కుదేలవుతున్నాడని ఎంపీ నామా మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వరి విస్తీర్ణం తగ్గిందని, ఈ నేపథ్యంలో ప్రపంచానికి అన్నంపెట్టే రైతన్నపై కేంద్రం పిడుగు వేసిందని ఆరోపించారు. పెంచిన డీజిల్ ధరలతో రైతుపై ఎకరానికి రూ.2,000 అధిక భారం పడుతున్నదని, దీనికి కేంద్రం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించి ఆ రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనకపోతే రైతన్న కష్టాలు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వమే కొన్నదని నామా లోక్సభలో స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని హితవు చెప్పారు. అటు.. తెలంగాణ రాష్ట్రం అప్పులతో సంపదను సృష్టించిందని, కేంద్రం ఉన్న ప్రభుత్వ ఆస్తులనూ అమ్మేస్తున్నదని ఎంపీ నామా కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అప్పులతో డ్యామ్లు, పవర్ప్లాంట్లు, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించారు. ఎఫ్ఆర్బీఎం, ఆర్బీఐ విధివిధానాలకు అనుగుణంగానే తెలంగాణ సర్కారు అప్పులు చేస్తున్నదని, సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నదని చెప్పారు. లక్షల కోట్ల అప్పులు చేసిన కేంద్రం.. జాతి వికాసానికి దోహదం చేసే ఏ కార్యక్రమాన్నైనా చేపట్టిందా? అని ప్రశ్నించారు. దేశంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు పెరిగాయని, వివిధ సూచీల్లో దేశం అట్టడుగుస్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పురోగమిస్తున్న తెలంగాణపై కేంద్రానికి వివక్ష ఎందుకని నామా నాగేశ్వర్రావు నిలదీశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం.. కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
నిత్యావసరాల ధరల పెంపుపై ప్రతిపక్షాల విమర్శలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారంపై కేంద్రం ఏమాత్రం సీరియస్గా లేదని విపక్ష ఎంపీలు మోదీ సర్కార్ విధానాలను దుయ్యబట్టారు. ధరల పెంపుపై టీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు పది రోజులుగా చేస్తున్న ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. ధరాఘాతంపై లోక్సభలో ఎట్టకేలకు సోమవారం చర్చ ప్రారంభమైంది. అంతకుముందు స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు. చర్చ అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్, ఇతర పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్సభలో చర్చను ప్రారంభించారు. మోదీ సర్కార్ నిర్ణయాలతో దేశంలో 25 కోట్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. పిండి, పెరుగు, పన్నీరు వంటి వస్తువులపై జీఎస్టీ విధించడం దారుణమని, పెన్సిల్, షార్పెనర్ వంటి వాటిపై కూడా జీఎస్టీ వేసి చిన్న పిల్లలను కూడా వదలలేదని మండిపడ్డారు. టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ పచ్చి వంకాయను కొరుకుతూ ‘ప్రజలు ఇలా పచ్చి కూరగాయలు తినాలా?’ అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. పేదలు, సామాన్య ప్రజలు నిత్యావసరాలుగా వినియోగించే వస్తువులపై పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తన బడ్జెట్ను క్రమబద్ధీకరించుకునే పేరుతో దేశంలోని కోట్లాది కుటుంబాల బడ్జెట్ను నాశనం చేసిందని బీఎస్పీ ఎంపీ సంగీత ఆజాద్ అన్నారు. ‘ధరల షాక్ ప్రతి గృహిణిని కన్నీరు పెట్టిస్తున్నది. ఏ విధమైన దేశాన్ని కేంద్రం నిర్మించాలనుకుంటున్నది’ అని మోదీ సర్కార్ను నిలదీశారు. ఐయూఎంఎల్ ఎంపీ మహమ్మ ద్ బషీర్ మాట్లాడుతూ కుటుంబ బడ్జెట్ కుప్ప కూలుతున్నదని, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో కేంద్రం ఏమాత్రం సీరి యస్గా లేదని దుయ్యబట్టారు. ‘ప్రతి ఇంటి వంటగది ఇబ్బందుల్లో ఉన్నది. మనం కొవిడ్ సమయంలో లాక్డౌన్ చూశాం. ప్రభుత్వ ప్రతికూల వైఖరి కారణంగా ఇప్పుడు వంటగదులు లాక్డౌన్లో పడుతున్నాయి’ అని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు హామీపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలకు ముడిపెట్టడం బూటకమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. గతనెల జీఎస్టీ విధింపు నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీఎస్టీ రద్దు, పెరిగిన ధరలు తగ్గించాలన్న విపక్ష సభ్యుల డిమాండ్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూటిగా సమాధానం చెప్పలేదు. జీఎస్టీ వసూళ్లు, పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్(పీఎంఐ) వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతున్నదనే విషయాన్ని చెబుతున్నాయని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 7 శాతం కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ధరలు తగ్గిస్తామని మాట మాత్రమైనా హామీ ఇవ్వని కేంద్రం తీరుపై నామా తీవ్రంగా స్పందించారు. కేంద్రానికి ప్రజాసమస్యలను పట్టించుకునే తీరిక లేదని మండిపడ్డారు. మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్, డీఎంకే సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.