హైదరాబాద్, మార్చి 14 : ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొనేందుకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సభలు, సమావేశాలు పెడుతున్నాడని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడిలా కాకుండా ఆంధ్రాపెట్టుబడిదారులకు బ్రోకర్లా మారిన రేవంత్ వంటి అహంకారి, గజదొంగ లేరని మండిపడ్డారు. కొడంగల్లో ప్రజలు బుద్ధి చెప్తే మల్కాజ్గిరిలో చావుతప్పి కన్నులొట్టబోయిన తీరుగా గెలిచాడని ఎద్దేవాచేశారు. పాలమూరు పచ్చబడటం ఏమాత్రం ఇష్టంలేకనే కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొన్నారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, సుంకి రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, వీఎస్ అబ్రహాంలతో కలిసి మాట్లాడారు. కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్, మంత్రులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతరించిపోతున్న పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు. తనకే గతిలేదు, మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే ఈసారి మల్కాజ్గిరిలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. రేవంత్ మాటలకు, చేతలకు పొంతన లేదని.. పిచ్చికుక్క కరిచిన వాడిలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్.. క్షమాపణ చెప్పు
మన ఊరు మన పోరు కార్యక్రమానికి బూతు పురాణం అని పేరు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. కోర్టుల్లో కేసులు పెడుతూ, ప్రాజెక్టులు నిర్మిస్తలేరని మాట్లాడుతున్నాడని.. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని గువ్వల సవాల్ విసిరారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ బీసీలను అవమానపర్చడమేనని మండిపడ్డారు. తనలాం టి దళిత బిడ్డలను అవమానపరిస్తే ఎవరూ సహించరని అన్నారు. రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రేవంత్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ దక్కకుండా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ మాటలతో పాలమూరు ప్రజల ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి బతికి ఉన్నప్పుడు తిట్టి, ఇప్పుడు పొగుడుతున్నాడని మండిపడ్డారు.
డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి: కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
అధిష్ఠానానికి డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చెప్పారు. కొడంగల్లో రేవంత్ తనపై పోటీకి వస్తే, మరోసారి ఓడించి చూపిస్తానని అన్నారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఒక్క సీటు గెలవరు: దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
ఎన్ని జిమ్మిక్కులు చేసిన రేవంత్రెడ్డి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా గెలిపించలేరని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. హోదామారినా రేవంత్ బుద్ధి మారట్లేదని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. మన ఊరు మన పోరు కాదని.. మన ఊరు మన వసూలు అని పేరు మార్చుకోవాలన్నారు.
రేవంత్కు గుణపాఠం తప్పదు: అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం
పాలమూరులో అన్ని సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం స్పష్టంచేశారు. రేవంత్రెడ్డికి పాలమూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.