హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. మం డల ప్రాదేశిక ప్రాంతానికి (ఎంపీటీసీ) ఒక బాధ్యుడిని నియమించారు. వీరంతా శుక్రవారం మునుగోడులో వారి కి కేటాయించిన గ్రామాలకు చేరుకొని ఇంటిం టి ప్రచారాన్ని ప్రారంభించారు.
ద్విముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ ప్రచారం చేయడం, బీజేపీ అభ్యర్థి రూ.24 వేల కోట్ల కాంట్రాక్ట్ పొందడం కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారని ఇల్లిల్లూ తిరిగి మనిషి మనిషికి చెప్పడమనే ద్విముఖవ్యూహంతో గులాబీ శ్రేణులు కదులుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి నాయకత్వంలో మునుగోడులో ఇప్పటికే ఊరూరా జల్లెడ పట్టారు. గ్రామగ్రామాన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అన్ని వర్గాలను కలిశారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్ను గెలిపిస్తాం, పార్టీయే తమ అభ్యర్థి అని ప్రజలను గులాబీ శ్రేణులు సమాయత్తం చేశాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ వెలిసిన మునుగోడు నియోజకవర్గం తమకు బ్రహ్మరథం పడుతుందని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. తమ జిల్లా నుంచి ఫ్లోరైడ్ను తరిమికొట్టిన సీఎం కేసీఆర్ వెంటే తాముంటామని జనం తేల్చిచెప్తున్నారు. అభ్యర్థి కోసం సైనికుల్లా పనిచేసేందు కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన గ్రామాల్లో మకాం వేశారు.
అభ్యర్థి ప్రకటనతో సంబురాలు
టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, బీ ఫాం ఇవ్వడంతో నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. పార్టీ శ్రేణులు, ప్రజలు గ్రామగ్రామాన మిఠాయిలు పంచుకొని, పటాకులు కల్చారు. తాము కోరుకొన్న వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
గట్టుప్పల్కు కేటీఆర్, మర్రిగూడకు హరీశ్
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. గట్టుప్పల్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మర్రిగూడకు మంత్రి హరీశ్రావు బాధ్యత వహిస్తారు. చండూరు మున్సిపాలిటీలోని ఒక వార్డుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆరెగూడెంకు మంత్రి మల్లారెడ్డి, డీ నాగారానికి మంత్రి ప్రశాంత్రెడ్డి, చౌటుప్పల్కు మంత్రి శ్రీనివాస్గౌడ్, కొరిటిగల్కు మంత్రి అజయ్, డీపీపల్లికి మంత్రి నిరంజన్రెడ్డి, మునుగోడుకు మంత్రి జగదీశ్రెడ్డి, పసునూరుకు మంత్రి సబిత, నారాయణపురం-2కు మంత్రి గంగు ల కమలాకర్, ఎర్లగడ్డతండాకు మంత్రి సత్యవతి, పలివెల గ్రామానికి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ప్రజల్లో భరోసా నింపడానికి టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం నియోజకర్గంలోని ఒక యూనిట్కు బాధ్యతలు తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ప్రచారబాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈ గ్రామంలో 1,825 ఓట్లు ఉన్నాయి.