సూర్యాపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పై ఫొటోలో ఉన్నది సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల శివారులోని డీబీఎం-71 కాల్వ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్, మునగాల, నడిగూడెం, మోతె మండలాలకు గోదావరి జలాలు చేరుకొన్నాయి. ఫలితంగా ఇక్కడి ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు చేరుకొన్నది. ఇక్కడి ప్రధాన కాల్వలైన డీబీఎం-69, 70, 71 ద్వారా 6వేల క్యూసెక్కుల నీరు పారుతుండగా దాదాపు 215 గ్రామాలలోని 350 పైనే చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి.
గతంలో నీళ్లు లేక సారవంతమైన భూములు కూడా పడావుపడ్డాయని, కాళేశ్వరం జలాలతో ఇక్కడి భూములు సస్యశ్యామలం అయ్యాయి. నీళ్లు పుష్కలంగా ఉండడంతో అనుకూలమైన పంటలు పండిస్తున్నాం. – రైతు కోట రాంరెడ్డి,
రావిపహాడ్, సూర్యాపేట జిల్లా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన హోదాను విస్మరించి సీఎం కేసీఆర్పై అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్లో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులు.. కేంద్రంలో తమ పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంత్రి బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. బీజేపీ నాయకుల తీరును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం నిర్మించిన సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు కొనియాడుతుంటే.. బీజేపీ నాయకులకు మింగుడుపడక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.