హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజాస్వామ్య ద్రోహి అని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లో మెలిగే రేవంత్.. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో ముంచేంతవరకు నిద్రపోడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి హుందాతనాన్ని మరిచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ.. దళితులు, అణగారిన వర్గాలను ఓటుబ్యాంకుగానే చూసింది తప్ప వారిని ఉద్ధరించడానికి చేసిందేమీ లేదని విమర్శించారు. వారి వెనుకబాటుతనానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన రేవంత్.. తెలంగాణ కోసం దేశరాజధానిలో పార్లమెంట్ సాక్షిగా ఆత్మహత్య చేసుకొన్న యాదవరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబుతో చేతులు కలిపిన ప్రజాస్వామ్య హంతకుడు రేవంత్ అని.. ఆయనకు దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాలు విసిరారు. రేవంత్ నాయకత్వంలో పనిచేయలేమని చాలామంది సీనియర్లు బాహాటంగానే చెప్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
మూడు కాళ్లున్నాయా?: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
వామనావతారం ఎత్తడానికి రేవంత్రెడ్డికి ఏవైనా మూడు కాళ్లున్నాయా? అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రశ్నించారు. రేవంత్రెడ్డి దొంగల ముఠాకు సర్దార్లా మారిపోయాడని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డిలా పిచ్చిప్రేలాపనలు చేయాలంటే తమకు చిటికెలో పని అని, కానీ తమకు సీఎం కేసీఆర్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని పదే పదే చెప్తున్నారు కాబట్టే మౌనంగా ఉంటున్నామని అన్నారు. అది తమ నైతిక బాధ్యతే తప్ప అసమర్థత కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్రెడ్డి పిచ్చిపనులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే రాళ్లతో కొట్టి బయటకు పంపుతారని అన్నారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపించాలని లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం వ్యవసాయయోగ్యం కాని భూములనే సేకరించిందని, అందులో 90% మంది లబ్ధిదారులకు పరిహారం ఇప్పటికే అందిందని చెప్పారు. తాను అవినీతి పాల్పడినట్టు రుజువు చేస్తే తాను అన్నిటికీ సిద్ధమని, మధుయాష్కీ సిద్ధమా? అని ప్రశ్నించారు. తనపై మూడుసార్లు పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాలిబన్ రేవంత్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
అఫ్గానిస్తాన్లో తాలిబన్ల తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్ష పదవి రాగానే కొమ్ములొచ్చినట్టు రేవంత్ భావిస్తున్నాడని అన్నారు. ఆయన నిజస్వరూపం తెలంగాణ ప్రజలకు తెలుసని.. సమయం వచ్చినప్పుడు ఆ కొమ్ములు విరిచేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల మనసులు గెలవాలని.. కానీ.. రేవంత్కు ఆ పని చేతకాదన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై రేవంత్ విషం చిమ్ముతున్నారని, ప్రజలు బాగుపడటం ఆయనకు ఇష్టం లేనట్టున్నదని పేర్కొన్నారు. తన సొంత ఊర్లో దళితులను రేవంత్ ఎప్పుడైనా గౌరవించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్లను అమ్ముకోవడానికి మాత్రమే సీట్ల పెంపు గురించి పార్లమెంట్లో అడిగారన్నారు. దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
హీరో కాదు జీరో: ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
పీసీసీ చీఫ్ కాగానే రేవంత్రెడ్డి హీరో అయ్యానని అనుకొంటున్నారని, కానీ ఆయన ఎప్పటికీ జీరోగానే మిగిలిపోతాడని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ బూతులు మాట్లాడితే ప్రజలు అసహ్యించుకొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఏడేండ్ల కాలంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలబెట్టారని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ అందుతుంటే రేవంత్రెడ్డి వంటి వాళ్లకు కండ్లు కుడుతున్నాయని పేర్కొన్నారు.