హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్రెడ్డి కొత్త బిచ్చగాడిలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పీయూసీ ఛైర్మన్ ఏ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిలు ఎద్దేవాచేశారు. తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, నాయకులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మారకపోతే తగిన బుద్ధి చెప్పక తప్పదని హితవు పలికారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి, గోడలమీద రాతలు రాసుకొన్న రేవంత్రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. పదవి రాగానే కొత్త బిచ్చగాడిలాగా వ్యవహరిస్తున్నారన్నారు. ‘బిడ్డా రేవంత్.. నువ్వెంత.. నీ పర్సనాలిటీ ఎంత?.. దమ్ముంటే రాజీనామా చెయ్యి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం..అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది’అని సవాల్ విసిరారు. తమ శక్తి ఏంటో ప్రదర్శిస్తే రేవంత్రెడ్డి గజ్వేల్లో కనీసం అడుగు కూడా పెట్టలేడని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మూడు నాలుగేండ్లు మేధోమథనం చేసి దళితబంధు పథకాన్ని తీసుకొస్తే.. దాన్ని ఆపాలని కుట్రచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంద్రవెల్లిలో రేవంత్ సభ ముగిసిన వెంటనే 500 మంది కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారని ఎద్దేవాచేశారు. ఆర్థిక నేరగాడు, ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి త్వరలోనే జైలుకు పోవడం ఖాయమన్నారు.
హుజూరాబాద్లో డిపాజిట్ కూడా రాదు: ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే
రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని అన్న విషయం కూడా మర్చిపోయి రేవంత్రెడ్డి మాట్లాడుతున్న భాష చూస్తే.. కాంగ్రెస్ ఎంతటి దుస్థితిలో ఉన్నదో అర్ధమవుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. స్టేజీ కింద ఉన్న నలుగురు చప్పట్లు కొడుతున్నారని, ఈలలు వేస్తున్నారని దిగజారి వ్యాఖ్యలు చేయడం పార్టీ అధ్యక్షుడి స్థాయికి తగదని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు కనీసం అభ్యర్థి దొరికే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్ రావడం కూడా కష్టమేనన్నారు.
తుపాకీరాముడు : ఏ జీవన్రెడ్డి, పీయూసీ చైర్మన్
పీసీసీ అధ్యక్షుడి ఉద్యోగం రేవంత్రెడ్డికి వచ్చిందంటే.. అది ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ భిక్షే అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ టీడీపీ ఆఫీసుకు చప్రాసీగా పనిచేసిన రేవంత్.. ఇప్పుడు తుపాకీరాముడిలా మాట్లాడే మాటలను ఎవరూ నమ్మబోరని పేర్కొన్నారు. తెలంగాణలో సోనియమ్మ రాజ్యమొచ్చేదెప్పుడో కానీ, రేవంత్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థిపై.. రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతూ.. విద్యావంతులను చేస్తుంటే రేవంత్ మాత్రం చదువులేని సన్నాసిలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొట్లాడి, రాష్ర్టాభివృద్ధికి నలు దిక్కులుగా ఉన్న కేటీఆర్, హరీశ్రావు, కవిత, సంతోష్ గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఒక్క సైగ చేస్తే మూడు ఫీట్ల రేవంత్ గాలికి కొట్టుకుపోతారని తెలిపారు.