హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మండిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ భారంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు విపక్షాలు కూడా జత కలిశాయి. ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథిరెడ్డి, పోతుగంటి రాములు, జీ రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్రం పెంచిన అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. వీరికి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ఎంపీలు సంఘీభావం ప్రకటించారు.
ఉభయ సభలు ప్రారంభంగానే కేశవరావు, నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పేద ప్రజల బతుకును ఛిద్రం చేస్తున్నాయని, దీనికి కేంద్రంలోని మోదీ సర్కారే కారణమని మండిపడ్డారు. రాజ్యసభలో చైర్మన్ పోడియం, లోక్సభలో స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లి నినాదాలు చేశారు. టీఆర్ఎస్, విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశాలు ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ లోక్సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్ చేసింది.