హుజూరాబాద్, చౌరస్తా ఆగస్టు 14: దళిత బంధు పథకంపై వదంతు లను నమ్మొద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్ హాలులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధుపై కొందరు పాల్పడే కుట్రలకు బలికావొద్దని సూచించారు. దళితుల సంక్షేమంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. దళిత బంధు పథకం దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అని ప్రశ్నించారు. దళిత బంధును ఆపేందుకు జరిగే ప్రయత్నాల్లో ఎవరూ భాగస్వాములు కావద్దని కోరారు. అర్హత ఉన్న దళిత కుటుంబాలకు తప్పకుండా రూ.10 లక్షలు వస్తాయన్నారు. ఈ పథకాన్ని దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో అమలవుతుందన్నారు. తద్వారా రాష్ట్రంలోని దళితులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితులంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.